ఆనాడు రెచ్చగొట్టి.. ఇలా చేస్తారా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

by Rajesh |
ఆనాడు రెచ్చగొట్టి.. ఇలా చేస్తారా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ సర్కారు తీరును ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టారని.. అధికారంలోకి రాగానే వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1మెయిన్స్‌కు 1:100 మరియు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి, అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు.25వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులుదులుపుకున్నదని సీరియస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఆరు నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపించకపోవడం విద్యార్థులను మోసం చేయడమే అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed