- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Harish Rao: డబ్బా ప్రచారం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు విమర్శలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఇచ్చిన హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి వచ్చిందన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా (MGNREGS) ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక వెతలు పడుతున్నారని తెలిపారు. ఎమ్జీఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు ఇలా వేల మంది చిరు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దయనీయ పరిస్థితి వచ్చిందన్నారు.
దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారు. కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని సూచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.