సోమేష్ కుమార్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్

by Satheesh |
సోమేష్ కుమార్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమితులు కానున్నారు. దాదాపుగా నిర్ణయం ఖరారైంది. ఇక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కావడమే తరువాయి. గత కొంతకాలంగా సోమేశ్ కుమార్ నియామకంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో నియమిస్తారని, ‘రెరా’ చైర్మన్‌గా నియమిస్తారని, ఎక్సయిజ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (రిటైర్ అయిన తర్వాత కూడా) వార్తలు వెలువడ్డాయి. కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమితులవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా ఆయనను అప్పటి ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయించినా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో తెలంగాణలో 2022 డిసెంబరు వరకు కంటిన్యూ అయ్యారు. చివరకు హైకోర్టు తీర్పుతో ఆయన ఆ రాష్ట్రానికి బదిలీ కావడంతో సంక్రాంతి పండుగకు ముందు అక్కడ చేరి చివరకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా పనిచేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ రాజీవ్ శర్మ వ్యవహరిస్తున్నారు. ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఈ ఇద్దరూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారులయ్యారు.

Also Read..

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

Next Story

Most Viewed