BRS Vs YCP : ఢిల్లీ దీక్షకు దూరం.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కటీఫ్?

by Rajesh |
BRS Vs YCP : ఢిల్లీ దీక్షకు దూరం..  బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కటీఫ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ మధ్య స్నేహం బెడిసికొట్టిందా? కేసీఆర్, జగన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన దీక్షకు ఆహ్వానం లేదా? ఆ కారణంగానే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలకలేదా? లేక ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారా? ఇవీ ఇప్పుడు ఢిల్లీ, ఏపీ, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ చర్చలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సంబంధాలు ఫలితాల అనంతరం మారాయనే జనరల్ టాక్ మొదలైంది. ఏపీలో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో ఆ ఇద్దరి మధ్య రిలేషన్స్ లో తేడా వచ్చిందనేది ఆ చర్చల సారాంశం. ఏపీలోని పల్నాడు జిల్లా సహా పలు చోట్ల తెలుగుదేశం స్థానిక కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జగన్ చేపట్టిన నిరసన దీక్షకు బీఆర్ఎస్ తరఫున మద్దతు లేకపోవడం ఈ చర్చలకు ప్రధాన కారణం.

‘ఇండియా’ టీమ్ మద్దతు

అన్ని పార్టీలకూ ఆహ్వానం పలికామని వైఎస్సార్సీపీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం జగన్ నుంచి ఆహ్వానం అందడంపై మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ టీమ్‌కు చెందిన సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే) తదితరాలతో పాటు అన్నాడీఎంకే, విడుదలై చిరుత్తై కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు జగన్ నిరసన దీక్షకు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ నెల 24న జరిగిన ఆ దీక్ష సమయంలో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ అవసరం లేదని జగన్ భావించారేమో... అందుకే పెద్దగా ఆ పార్టీ నుంచి మద్దతును ఆశించలేదేమో... అనే చర్చలూ జరుగుతున్నాయి.

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు... ఆ పార్టీలన్నింటినీ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక గొడుకు కిందికి తీసుకురావాలని భావించిన కేసీఆర్ తరఫున ఏపీలో ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉన్న జగన్‌కు మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. ‘ఇండియా’ టీమ్‌లోని పలు పార్టీల ప్రతినిధులు జగన్‌ను దీక్షా వేదిక మీద కలిసి సంఘీభావం తెలపడంతో కూటమిలో చేరుతున్నారంటూ జాతీయ స్థాయిలోనే పొలిటికల్ డిబేట్ మొదలైంది. దీనిపై జగన్ తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చినప్పటికీ ఆయనను కలిసిన నేతలు మాత్రం పాజిటివ్ సంకేతాలను ఇవ్వడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఆ కూటమికి దగ్గరవుతున్నదనే చర్చల సమయంలో ఆయనను కలిసి సంఘీభావం తెలిపితే బీఆర్ఎస్‌కు కూడా ఆ మచ్చ అంటుతుందనే ఉద్దేశంతో గులాబీ ఎంపీలు దూరంగా ఉన్నారనే అనుమానాలూ పలు పార్టీల ఎంపీల నుంచి వ్యక్తమయ్యాయి.

వ్యూహాత్మకంగానేనా!

ఒకవైపు బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతున్నదంటూ ఊహాగానాలు వెలువడుతూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ‘ఇండియా’ కూటమికి వైఎస్సార్సీపీ దగ్గరవుతున్నదనే సమయంలో దీక్షా వేదిక దగ్గరకు వెళ్లి కలవడం రాంగ్ మెసేజ్ వెళ్తుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే మాటలూ వినిపిస్తున్నాయి. బీజేపీకి ఆగ్రహం కలిగించకూడదనే భావనతోనే దూరంగా ఉన్నదేమోననే సందేహాలూ వివిధ పార్టీల నేతల నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ కేసీఆర్, జగన్ మధ్య స్నేహం ఉన్నా రెండు రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలూ అధికారాన్ని కోల్పోయిన తర్వాతి పరిణామాల్లో దూరం పెరగడం కీలకంగా మారింది. ఉద్దేశపూర్వకంగా జగనే కేసీఆర్‌ను దూరం పెట్టారా? లేక నిరసన దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతు పలికితే బీజేపీకి కోపం వస్తుందని భావించి వ్యూహాత్మకంగా వ్యవహరించిందా? వీటికి రానున్న రోజుల్లో స్పష్టత లభించనున్నది.



Next Story