ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు

by Satheesh |
ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే పాత బస్తీలో మెట్రో రైలు లైన్‌కు శంకుస్థాపన చేయటంతో పాటు మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను సమకూర్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా అశీర్వాదాలుండాలని ఆయన ప్రార్ధించారు.

Next Story