పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

by Mahesh |
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రోగ్రెస్‌పై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..వచ్చే ఏడాది మార్చి నాటికి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా నదులపై గతంలోనే పనులు ప్రారంభమై వేర్వేరు కారణాల రీత్యా అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అందులో గోదావరి నదిపై నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సీఎం..తక్కువ ఖర్చుతోనే వీటిని పూర్తి చేయొచ్చని, వెంటనే వాటిని వినియోగంలోకి తేవడం ద్వారా దాదాపు 48 వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చనే అంచనాకు వచ్చారు. రైతులకు మేలు చేసే విధంగా తొలి ప్రాధాన్యతను ఈ పెండింగ్ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన రూ.241 కోట్లను వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. అసంపూర్తిగా ఉండిపోయిన పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా అధికారులు అందించిన వివరాల మేరకు ఆరింటిని ఎంపిక చేశారు.

సమగ్ర ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశం..

గోదావరి బేసిన్‌లోని నీల్వాయి వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడివాగు, ఎస్సారెస్పీ స్టేజీ-2, సదర్మట్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులను పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం రూపొందించిన అంచనాలను పరిశీలించారు. తక్కువ నిధులతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తి చేపట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలు ఆరా..

నీల్వాయి వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ-2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి..అసంపూర్తిగా ఉన్నవి..గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలను ఆఫీసర్ల నుంచి ఆరా తీసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను కూడా ఇంజినీర్ల నుంచి ఆరా తీశారు.

గత ప్రభుత్వం బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితం

రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన ప్రాజెక్టులను బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాని, భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే వదిలేసిందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని వివరాల ఆధారంగా ఒక అంచనాకు వచ్చారు. ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగు నీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed