వైఎస్ఆర్ బాటలో సీఎం రేవంత్.. KCR మిస్టేక్ రిపీట్ కావొద్దని స్కెచ్!

by Rajesh |
వైఎస్ఆర్ బాటలో సీఎం రేవంత్.. KCR మిస్టేక్ రిపీట్ కావొద్దని స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి ప్రజాప్రతినిధులకు చేరువయ్యేలా సరికొత్త ప్రణాళిక రచించారు. త్వరలో ప్రతి రోజూ సాయంత్రం రెండు గంటల పాటు పార్టీ లీడర్లకు సమయం కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్, ఇతర ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే లోకసభ ఎన్నికలు రావడం, ఆ తరువాత పాలనను గాడిలో పెట్టేందుకే ఫోకస్ పెట్టడానికి రేవంత్‌కు సమయం సరిపోయింది. అసెంబ్లీ సమావేశాల తరువాత ప్రతిరోజూ పార్టీ లీడర్లకు టైమ్ కేటాయిస్తానని ఈ మధ్య ప్రజాభవన్‌లో జరిగిన పార్టీ మీటింగ్‌లో స్వయంగా సీఎం హామీ ఇచ్చినట్టు తెలిసింది.

గ్యాప్ రాకుండా జాగ్రత్తలు

పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నది. ఈ కాలంలో సీఎం రేవంత్‌ను ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నేరుగా కలిసే చాన్స్ లేదు. ఏదైనా పని ఉంటే సీఎం నేరుగా సంబంధిత ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడటమో లేకపోతే ఇంటికి పిలిచి చర్చించడమో చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆయనకు కుదరకపోతే ఆయన వెంట ఉండే సలహాదారుల్లో ఒకరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. దీని వల్ల సీఎం, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతుందేమోననే అనుమానాలు పార్టీలో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మెజార్టీ మంది ఎమ్మెల్యేలు మాత్రం సీఎంను కలిసి, నేరుగా తమ సాదకబాధకాలను వివరించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సెక్రటేరియట్ లేదా ఇంటివద్ద రోజూ సాయంత్రం రెండు గంటలపాటు పార్టీ లీడర్లకు టైమ్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

వైఎస్‌ను ఫాలో అవుతోన్న రేవంత్

వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం రేవంత్ కొనియాడారు. పాలనలో ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతి రోజూ సాయంత్రం 2 గంటల పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సమయం కేటాయించేవారు. ఆ సమయంలో లీడర్లు వైఎస్‌ను కలిసి తమ సమస్యలను వివరించేవారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు, ఇంటర్నల్ పాలిటిక్స్ అంశాలపై స్వేచ్ఛగా చెప్పుకునేవారు. వాటన్నింటినీ ఓపిగ్గా విని, కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపేవారు. దీనితో వైఎస్సార్ పట్ల లీడర్లకు విడదీయలేని బంధం ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం వైఎస్ తరహాలో పార్టీ లీడర్లను నేరుగా కలిసేందుకు చొరవ చూపడం వల్ల పార్టీతో పాటు, ఆయన కూడా మరింత బలోపేతం అవుతారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లీడర్లను కలవకపోవడమే కేసీఆర్ చేసిన తప్పు

పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను నేరుగా కలిసేందుకు ఇంట్రస్ట్ చూపలేదు. దీంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక స్వయంగా ప్రజాప్రతినిధులే ఇబ్బందులు పడ్డారు. దీనితో వారిలో గులాబీ బాస్ పట్ల వ్యతిరేకత ఏర్పడింది. అది మెల్లమెల్లగా పెరిగి, పెద్దదిగా మారి పార్టీ ఓటమికి ఒక కారణంగా నిలిచింది. నిజానికి లీడర్, కేడర్ మధ్య సంబంధాలు ఉండాలంటే ఇరువురు తరుచుగా కలుస్తుండాలి. అప్పుడే ఒకరిపై మరొకరికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. సమస్య మూలాలను లీడర్ నేరుగా గ్రహించగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజూ సాయంత్రం రెండు గంటల పాటు లీడర్లకు టైమ్ కేటాయించడాన్ని గులాబీ లీడర్లు సైతం స్వాగతిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed