కేటీఆర్ తో సమావేశమైన గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు

by Y. Venkata Narasimha Reddy |
కేటీఆర్ తో సమావేశమైన గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గ్రూప్ -1 అభ్యర్థులు తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల‌ని వారు కేటీఆర్‌ను అభ్యర్థించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణతో ఎదురయ్యే సమస్యలను, పరీక్షల వాయిదా అవసరాన్ని అభ్యర్ధులు ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కు వివరించారు. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్షలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే హాల్ టికెట్ల జారీ కూడా మొదలైంది. అయితే గ్రూప్-1 మెయిన్స్‌ను రీ షెడ్యూల్ చేయాల‌ని గ‌త కొద్ది రోజుల నుంచి అభ్యర్థులు కోరుతున్నారు. రెండు రోజులుగా అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో దొర్లిన తప్పులను, జీవో 29ని సవరించిన తర్వాతే మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

కేటీఆర్ తో భేటీ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ జీవో 29, జీవో 55పై ఎటూ తేల్చకుండా, ప్రిలిమ్స్‌ తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమో? కాదో? చెప్పకుండా ప్రశ్నల్లో తప్పులు దొర్లకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వకుండా, తెలుగు అనువాదం సరిగ్గా ఇస్తారా? లేదా? చెప్పకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఆయా అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే గ్రూప్‌-2, 3 పరీక్షలు పెట్టలనుకోవడం కూడా నిరుద్యోగులను ముంచడమేనని మండిపడ్డారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై సుమారు 33 కేసులు దాఖలయ్యాయని, అవన్నీ పరిష్కారమైన తర్వాతే మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-1 పరీక్షలు 2011లోనూ నిర్వహించి రద్దు చేశారని, 2016లో తిరిగి నిర్వహించారని గుర్తుచేశారు.

Advertisement

Next Story