మరి కాసేపట్లో కేసీఆర్‌తో BRS ఎమ్మెల్యేల సమావేశం.. సడెన్ భేటీకి కారణమిదే..!

by Satheesh |
మరి కాసేపట్లో కేసీఆర్‌తో BRS ఎమ్మెల్యేల సమావేశం.. సడెన్ భేటీకి కారణమిదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం కేసీఆర్‌తో మరీ కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్‌లో ఏ అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీని అసెంబ్లీ వేదికగానే ఇరుకున పెట్టాలని సూచించనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్లిన మేడిగడ్డ పర్యటనకు సంబంధించిన అంశాలపైన గులాబీ బాస్ ఆరా తీయనున్నట్లు టాక్.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు కీలక సూచనలు చేసిన కేసీఆర్.. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి వార్షిక పద్దుపై వారితో చర్చించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా కార్నర్ చేయాలో, ప్రభుత్వ విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రేపు (శనివారం) అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఎలా సాగుతుందోనని స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



Next Story