ఆచితూచి అడుగులు.. ఆ ప్రాజెక్టు పై వెనక్కి తగ్గిన బీఆర్‌ఎస్.. కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-16 03:26:19.0  )
ఆచితూచి అడుగులు.. ఆ ప్రాజెక్టు పై వెనక్కి తగ్గిన బీఆర్‌ఎస్.. కారణం ఇదే!
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో:పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అని మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతల పాలమూరు- ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాలు ఇప్పట్లో ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తాను పాలమూరు బిడ్డను అని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను పూర్తి చేయడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అనుమతితో త్వరలో ప్రాజెక్టుల సందర్శన చేపడతామని మీడియా ముందు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ తో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

బీఆర్ఎస్‌ను దెబ్బతీసిన..

పాలమూరు నీటి వాటాను సాధించుకొని ఇక్కడి వలసలను, కరువును నివారించడానికి తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతూ వచ్చారు. పలు సందర్భాల్లో పాదయాత్రలు, ధర్నాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పూర్తిస్థాయిలో సాగునీరు అంది తమ బతుకులు బాగుపడతాయని ఆశించారు. అందుకు అనుకూలంగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌కు మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి ఇచ్చారు.

ఇక్కడే కుర్చీ వేసుకుని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి చేయకుండా ఎన్నికల సందర్భంగా ఆగమేఘాలపై ఒక మోటార్ పంపును ఆరంభించి మమ అనిపించారు. దీంతో ప్రజలలో కేసీఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడానికి ఒక కారణం అయింది. కాంగ్రెస్‌కు విమర్శనాస్త్రం అయింది. దీంతో ఎన్నికల్లో 14 స్థానాలకు గాను అలంపూర్, గద్వాల స్థానాల్లో మాత్రమే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచిన విషయం పాఠకులకు విధితమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలే అవుతుంది.. ఇప్పుడే ఆందోళనలు చేస్తే ప్రజల నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు అని పార్టీ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు సమాచారం. దీంతో మరికొంత కాలం వేచి ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సంవత్సరం తర్వాతే ఆందోళనలు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తయిన తర్వాత పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోకుంటే అప్పుడు ఆందోళనలు చేపట్టాలన్న నిర్ణయానికి పార్టీ ముఖ్య నేతలు వచ్చినట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని.. ఆచితూచి అడుగు వేయాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed