రాహుల్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ద్రోహులే: సెవెళ్ళ మహేందర్

by srinivas |
రాహుల్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ద్రోహులే: సెవెళ్ళ మహేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్, రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగ ద్రోహులని బీజెవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు నిరసనగా శుక్రవారం బీజెవైఎం ఆధ్వర్యంలో రాహుల్ రేవంత్ రెడ్డి చిత్ర పటాలను దహనం చేశారు. ఈ సందర్బంగా మహేందర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో అశోక్ నగర్ గ్రంథాలయం వద్ద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని అందుకే వీరిద్దరూ తెలంగాణ నిరుద్యోగ ద్రోహులేనని చెప్పారు. ప్రభుత్వానికి గెలిపించండని ప్రజలను కోరి అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులను గాలికి వదిలేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో అన్ని రకాల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తూ ప్రజలను మోసంచేస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థుల అర్హత 1:100 కి, గ్రూప్ 2 , 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల పరీక్షలు వాయిదా వేసి వాటి సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ ప్రకటించాలని సెవెళ్ళ మహేందర్ డిమాండ్ చేశారు.



Next Story