అసలు దానికి మీనింగ్ ఉందా?.. బీజేఎల్పీ నేత ఏలేటి సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-15 16:07:33.0  )
అసలు దానికి మీనింగ్ ఉందా?.. బీజేఎల్పీ నేత ఏలేటి సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహిస్తోందని, అప్పటికీ అసలు ఎన్నికలే లేవని, అలాంటప్పుడు ప్రజాపాలన ఎలా అవుతుందని, అసలు దానికి మీనింగ్ ఉందా? అని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక విమోచన దినోత్సవమని, దీన్ని ప్రజా పాలన దినోత్సవంగా ఎలా జరుపుతారని ఏలేటి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పేర్లు పెట్టినా చరిత్ర మారదని, వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కానీ తెలంగాణలో ఎందుకు నిర్వహించడంలేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లిం ఓట్ల కోసం, ఎంఐఎం నేతల భయానికి విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆయన విమర్శలు చేశారు.

నిజాం కాలంలో హిందువుల మత మార్పిడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలన్న సూచన రేవంత్‌కు ఎవరు ఇచ్చారో.. అని, ఒకసారి సీఎం అయినా చరిత్ర తెలుసుకోవాలన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇక్కడ రాలేదని, 1948లో విలీనమప్పటి నుంచి 1950 వరకు ఎన్నికలే జరగలేదని, ప్రజలు ఓట్లే వేయనప్పుడు ప్రజాపాలన ఎలా అవుతుందని ఏలేటి ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే ప్రజలపై కాంగ్రెస్‌కు నిజమైన ప్రేమ ఉన్నట్లని, లేదంటే ముస్లిం ఓట్లకు భయపడే ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. విమోచన దినోత్సవాన్ని ఇంకా స్వేచ్ఛగా నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నామని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. రేవంత్ ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. దీనిపై ఇప్పటికే రేవంత్ కు లేఖ రాశానని, అలాగే ఆయనను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు హాజరవ్వాలని ఆహ్వానిస్తున్నట్లుగా ఏలేటి చెప్పారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది నీచమైన కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక మళ్లీ ముస్లింలకు భయపడి విమోచన వేడుకలను కాంగ్రెస్ నిర్వహించడం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్టీరింగ్ ఎంఐఎం వద్ద ఉందని, రెండు పార్టీలు ఎంఐఎంకు భయపడుతున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed