BIG Scam: రుణమాఫీ పేరిట భారీ స్కాం.. రైతుల పేరిట లోన్లు తీసుకున్న షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం

by Shiva |
BIG Scam: రుణమాఫీ పేరిట భారీ స్కాం.. రైతుల పేరిట లోన్లు తీసుకున్న షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు ఉన్న రుణాలకు సంబంధించి మొత్తాన్ని సర్కార్ బ్యాంకుల్లో జమ చేసింది. ఓ వైపు అప్పుల బాధ తీరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. కామారెడ్డి జిల్లాలో రైతులు లోబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా, కామారెడ్డి జిల్లాలో రుణమాఫీ పేరిట భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రైతుల పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లోన్లు తీసుకుని అందరికీ శఠగోపం పెట్టింది. రైతులకు కనీస సమాచారం లేకుండా సుమారు 2,500 మంది చెరుకు రైతుల పేరిట ఫేక్ లోన్స్ తీసుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణమాఫీ చేయడంతో సుమారు 400 మందికి మీ రుణాలు మాఫీ అయ్యాయంటూ బ్యాంకుల నుంచి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మైండ్ బ్లాంక్ అయిన రైతులకు అసలు ఏ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చివరికి బ్యాంకుకు వెళ్లి వాకబు చేయగా.. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరిట రుణాలు తీసుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులంతా మూకుమ్మడిగా వెళ్లి ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. తమ పేరిట రుణాలు తీసుకుని మోసం చేయడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ పరిణామంతో దిగొచ్చిన షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెక్కుల రూపంలో రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అయితే, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.



Next Story