Bhatti Vikramarka: రైతులకు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్.. పంట రాబడితో పాటు పవర్ రాబడికి ప్రణాళికలు

by Prasad Jukanti |   ( Updated:2024-09-14 10:17:20.0  )
Bhatti Vikramarka:  రైతులకు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్.. పంట రాబడితో పాటు పవర్ రాబడికి ప్రణాళికలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులకు సోలార్ పంపుసెట్లు అందించబోతున్నామని, దీంతో పంట రాబడి మాత్రమే కాకుండా పవర్ రాబడి కూడా వచ్చేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2029-30 నాటికి రాష్ట్రంలో థర్మల్ పవర్ కాకుండా గ్రీన్ పవర్ ద్వారా దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అందించే ప్రణాళికను రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా ధర్మపురి సెగ్మెంట్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 25-30 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ ఖర్చులతో పొలాల్లో సోలార్ పంపు సెట్లు పెట్టబోతున్నామని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వారి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు కనెక్ట్ చేసి విక్రయించుకుని రైతులు కొంత ఆదాయం పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మేడారం గ్రామంలో ఈ పథకాన్ని అమలు చేస్తామని భట్టి వెల్లడించారు. అలాగే ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా కుటుంబాలు ఆదాయం పొందేలా చేస్తామన్నారు.

ప్రాజెక్టులకు భూములిచ్చేవారికి ప్రయార్టీ..

ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చినవారు గొప్ప త్యాగధనులని భట్టి పేర్కొన్నారు. భూనిర్వాసితులను గౌరవించుకోవాలని, అందుకే వారికి ముందుగా పరిహారం చెల్లించాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతుబీమాకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని, త్వరలో పంటల బీమా ప్రీమియంను సైతం ప్రభుత్వమే చెల్లించబోతున్నదన్నారు. పాలకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ గురించి ఈ ప్రాంత ప్రజలు తన పాదయాత్ర సందర్భంగా కోరారని, వీటికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ త్వరలో శాంక్షన్ చేయబోతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed