మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం.. నాగార్జున తరపు లాయర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-08 12:32:31.0  )
మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం.. నాగార్జున తరపు లాయర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంగళవారం నాగార్జున హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల త‌మ‌ కుటుంబ పరువు మర్యాదలకు భంగం క‌లిగింది. త‌న కుమారుడు నాగచైతన్య, సమంత విడాకుల‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి.

జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. తమ కుటుంబంపై మంత్రి అలా మాట్లాడటం సరికాదు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని అని నాగార్జున డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బయట నాగార్జున తరపు లాయర్ అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ’మొదటి సాక్షి సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారు. ఈనెల 10వ తేదీన మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తారు. అదే రోజున(అక్టోబర్ 10న) మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి మాట్లాడిన వీడియోలను కోర్టుకు అందజేశాం. సురేఖపై చర్యలు తీసుకోవాలనే నాగార్జున కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు’ అని నాగార్జున తరపు లాయర్ అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story