ఆదిలాబాద్ ఎఫ్ఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి

by Sridhar Babu |
ఆదిలాబాద్ ఎఫ్ఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి
X

దిశ, ఆదిలాబాద్ : ఈనెల 22న రాత్రి 9 గంటల సమయంలో అకారణంగా తమపై చేయి చేసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆదిలాబాద్ ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ తో పాటు ప్రవీణ్ మిగతా 8 మంది అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బుధవారం అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆదివాసులు ఆందోళన చేపట్టారు. ఆదివాసుల పట్ల అటవీశాఖ అధికారులు కర్కషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గులాబ్ సింగ్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు, కొమ్ర లక్ష్మీబాయి మాట్లాడుతూ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని దహిగూడ గ్రామానికి చెందిన కుమ్ర లక్ష్మీబాయి, నిరుద్యోగ పేద కొలాం యువకులు ఉపాధి నిమిత్తం ఎండిన కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు.

అయితే ఈనెల 22న రాత్రి 9 గంటల సమయంలో తమ పిల్లలైన మడావి జంగు, ఆత్రం దేవరావు, మడవి ముత్తలు కట్టెలు తీసుకొని వస్తుండగా ఫారెస్ట్ అధికారులు జిల్లా కేంద్రంలోని గౌరమ్మ బట్టి, కుమ్మరివాడ దగ్గర అడ్డుకొని ముగ్గురు కోలం గిరిజనులను కొడుతూ, మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. తాము ఓదార్చేందుకు వెళ్లగా తనను సైతం కొట్టడమే కాకుండా ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్, ప్రవీణ్ అటవీ అధికారులు, మరో ఎనిమిది మంది సిబ్బంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, కులం పేరుతో దూషిస్తూ కించపరిచారని తెలిపారు. వెంటనే ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమకు న్యాయం జరగకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, కొలం, తుడుం దెబ్బ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed