IRCTC - Swiggy : రైలు ప్రయాణాల్లో స్విగ్గీ హవా.. 20 రాష్ట్రాలకు విస్తరణ

by D.Reddy |
IRCTC - Swiggy : రైలు ప్రయాణాల్లో స్విగ్గీ హవా.. 20 రాష్ట్రాలకు విస్తరణ
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ట్రైన్ జర్నీలో ఫుడ్ డెలివరీ కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ (Swiggy) ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన కేవలం 4 స్టేషన్లకు మాత్రమే ఈ సేవలు అందించగా.. తాజాగా దేశంలోని 20 రాష్ట్రాలలో 100 రైల్వే స్టేషన్లకు తన ఫుడ్ డెలివరీ సేవలను స్విగ్గీ విస్తరించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

దీంతో ఇకపై స్విగ్గీ ద్వారా రైలు ప్రయాణికులు 60,000 కంటే ఎక్కువ బ్రాండ్‌ల నుంచి దేశవ్యాప్తంగా 35 కంటే ఎక్కువ వంటకాల నుంచి 7 మిలియన్లకు పైగా మెనూ ఐటెమ్‌ల నుంచి ఎంచుకోవచ్చు. 'నిజానికి రైలు ప్రయాణం అనేది.. భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. ఈ ప్రయాణంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రైళ్లలో స్విగ్గీ ఫుడ్‌ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఎక్కువ సౌలభ్యంగా ఉంది. అలాగే, ప్రయాణికులు విభిన్న రకాల భోజనాలను రుచి చూసే అవకాశం లభించింది' అని ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.

కాగా, రైళ్లలో ఆహారాన్ని అందించడానికి ఐఆర్‌సీటీసీతో మార్చి 2024లో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుంది. ప్రయాణికులు తాము ఎక్కడైతే ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నారో.. ముందు స్టేషన్‌లోనే స్విగ్గీ నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మరో ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో కూడా ఇదే తరహా సేవలను రైల్వే స్టేషన్లలో అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు కలిపి రోజుకు సుమారు లక్షకు పైగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్నట్లు సమాచారం.

గత సంవత్సరం స్విగ్గీ కేవలం 60 సెకన్ల హాల్ట్‌తో రైళ్లలో 35,000 ఆర్డర్‌లను డెలివరీ చేసింది. దాదాపు 54,000 మంది ప్రయాణికులు ఒకే ట్రిప్‌లో మల్టీ మీల్స్ ఆర్డర్ చేశారు. విజయవాడ జంక్షన్ గత సంవత్సరంలో అత్యధిక ఆర్డర్‌లను నమోదు చేసింది. ముఖ్యంగా కళ్యాణ్ జంక్షన్‌లో ప్రయాణికులు అతిపెద్ద ఆర్డర్ అంటే ఓ ఆర్డర్‌లో 41 బర్గర్‌లను ఆర్డర్ చేశారు.

Next Story

Most Viewed