సంచలనాలు సృష్టిస్తున్న గాయత్రి జోడీ.. సింగపూర్ ఓపెన్‌లో సెమీస్‌కు

by Harish |
సంచలనాలు సృష్టిస్తున్న గాయత్రి జోడీ.. సింగపూర్ ఓపెన్‌లో సెమీస్‌కు
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న సింగపూర్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ అదరగొడుతున్నారు. వరల్డ్ నం.30 ర్యాంక్‌లో ఉన్న ఈ జంట రెండో రౌండ్‌లో వరల్డ్ నం.2 జోడీకి షాకిచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. క్వార్టర్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ వరల్డ్ నం.6 జోడీని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి-ట్రీసా జాలీ 18-21, 21-19, 24-22 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కిమ్ యి యాంగ్-కాంగ్ యాంగ్‌ ద్వయంపై విజయం సాధించింది. గంటా 19 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను కొరియా షట్లర్లు నెగ్గడంతో మొదట భారత క్రీడాకారిణులకు శుభారంభం దక్కలేదు.

మిగతా రెండు గేముల్లో గాయత్రి, ట్రీసా జాలీ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రెండో గేమ్‌లో ఒక దశలో వారు 18-12తో వెనుకబడి మ్యాచ్‌ని కోల్పోయే స్థితిలో నిలిచారు. ఈ సమయంలో వారు పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 18-17తో పోటీలోకి వచ్చిన వారు.. అదే జోరులో రెండో గేమ్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో నువ్వానేనా అన్నట్టు పాయింట్ల కోసం భారత్, కొరియా షట్లర్లు పోటీపడ్డారు. అయితే, మొదటి నుంచి గాయత్రి జోడీ ఆధిక్యం కనబర్చినా ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. 19-19తో స్కోరు సమమవడంతో ఉత్కంఠ తారాస్థాయికి వెళ్లగా.. 22-22 తర్వాత గాయత్రి జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను దక్కించుకుంది. సూపర్ 750 టోర్నీలో సెమీస్‌కు చేరుకోవడం గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి ఇదే తొలిసారి. శనివారం జరిగే సెమీస్‌లో నమీ మత్సుయమ-చిహారు షిడా(జపాన్)తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed