ఇషాన్ కిషన్‌కు మళ్లీ గాయం.. దులీప్ ట్రోఫీ తొలిమ్యాచ్‌కు దూరం!

by Harish |
ఇషాన్ కిషన్‌కు మళ్లీ గాయం.. దులీప్ ట్రోఫీ తొలిమ్యాచ్‌కు దూరం!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా జట్టు నుంచి దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి గాయం బారిన పడ్డాడు. దీంతో జాతీయ జట్టులోకి రావాలనే అతని కల కలగానే మిగిలింది. ఈ నెల 5 నుంచి దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే, ఓపెనింగ్ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ ముందు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్.. తిరిగి జట్టులో స్థానం దక్కించుకోవాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. అందుకు అతను సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లే బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది.

దీంతో తిరిగి జాతీయ జట్టులోకి రావాలాన్నా.. సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకోవాలన్నా తప్పనిసరిగా దేశవాళీ టోర్నీలు ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందే. లేనియెడల ఎన్నటికీ జాతీయ జట్టులో స్థానం దక్కే అవకాశం లేదు. అంతకుముందు గాయం బారిన పడిన వాళ్ళు మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పకుండా ఫిట్‌నెస్ తప్పనిసరి అని బీసీసీఐ కొత్త నిబంధన తెచ్చింది. ఇందులో కోహ్లీ, రోహిత్, బుమ్రా లాంటి ప్లేయర్లకు మాత్రమే మినహాయింపు నిచ్చింది. ఈ క్రమంలోనే గాయం బారిన పడిన ఇషాన్ కిషన్ ఫిట్‌నెస్ నిరూపించుకోకుండా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

అయితే, ఇటీవల జార్ఖండ్ లీగ్ దశలోనే పరాజయం పాలవ్వడంతో ఇషాన్.. బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో రెండు గేమ్‌లు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం దులీప్ ట్రోపీ తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన కిషన్.. రెండో మ్యాచ్‌కు అయినా అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, కిషన్ భారత టెస్ట్ జట్టులో లేనియెడల కేరళ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ని జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, కిషన్ ఇప్పటివరకు T20 ప్రపంచ కప్, IND vs ZIM, IND vs SL సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story