పుణెలోనైనా సిరీస్ పట్టేస్తారా?.. నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ20

by Harish |
పుణెలోనైనా సిరీస్ పట్టేస్తారా?.. నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో నేడు నాలుగో టీ20లో తలపడనుంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యసేన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అదే జోరులో మూడో టీ20లో గెలిచి సిరీస్ దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, టీమిండియాకు ఇంగ్లాండ్ షాకిచ్చింది. మూడో టీ20లో ప్రత్యర్థి విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. దీంతో సిరీస్‌ను దక్కించుకోవాలంటే భారత్‌కు నాలుగో టీ20 కీలకంగా మారింది. పుణె మ్యాచ్‌లో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతమవుతుంది. ఓడితే మాత్రం సిరీస్ 2-2తో సమం అవుతుంది. అప్పుడు నిర్ణయాత్మక ఐదో టీ20లో సిరీస్ ఫలితం తేలుతుంది. అదే జరిగితే భారత జట్టుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, నాలుగో టీ20లోనే సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్ భావిస్తున్నది. మరోవైపు, గత మ్యాచ్ విజయంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. దీంతో పుణెలోనూ ఆ జట్టు విజయం కోసం గట్టిగానే ప్రయత్నించొచ్చు. తొలి రెండు మ్యాచ్‌ల్లోలాగా సూర్య సేన అన్ని విభాగాల్లో రాణిస్తే విజయం పెద్ద కష్టమేమీ కాదు.

బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాల్సిందే

తొలి టీ20లో అభిషేక్ శర్మ, రెండో టీ20లో తిలక్ వర్మ భారత్ బ్యాటింగ్‌కు అండగా నిలిచారు. మిగతా వారు విఫలమైన ఆ మ్యాచ్‌ల్లో వీరిద్దరూ సంచలన ఇన్నింగ్స్ ఆడటం, దానికితోడు బౌలర్లు మెరవడంతో భారత్ విజయం సాధించింది. అయితే, మూడో టీ20లో బ్యాటుతో విఫలమవడం ద్వారానే మ్యాచ్‌‌ను కోల్పోవాల్సి వచ్చింది. 172 పరుగుల ఛేదనలో 145 స్కోరుకే పరిమితమై ఓటమి పాలైంది. ఇక, కీలకమైన నాలుగో టీ20లో భారత్ బ్యాటింగ్‌ లోపాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ గత మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారారు. వారిద్దరూ త్వరగానే అవుటవడం మిగతా సభ్యులపై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి, వారు నాలుగో టీ20లోనైనా పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాండ్యా గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బ్యాటుతో తమ వంత పాత్ర పోషించలేకపోతున్నారు. వారు విలువైన పరుగులు జోడించినా జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి.

రింకు, అర్ష్‌దీప్ తిరిగి తుది జట్టులోకి..

నాలుగో టీ20లో భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన బ్యాటర్ రింకు సింగ్ పుణె మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ధ్రువ్ జురెల్‌ను పక్కనపెట్టి రింకు‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే, గత మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చిన అర్ష్‌దీప్ సింగ్ కూడా తిరిగి ప్లేయింగ్ 11లోకి రానున్నాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అతన్ని తీసుకోనునున్నట్టు తెలిసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ తుది జట్టులో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. మూడో టీ20లో అతను తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

పిచ్ రిపోర్ట్

పుణెలోని ఎంసీఏ స్టేడియం పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ. అయితే, ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపొచ్చు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు టర్న్, బౌన్స్ పొందుతారు. అలాగే, ఈ పిచ్ బ్యాటర్లకు కూడా అనుకూలమే. ఈ స్టేడియంలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ రెండింట గెలిస్తే.. రెండింట ఓడింది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 206. అత్యల్ప స్కోరు 101. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 166గా ఉన్నది.


Next Story

Most Viewed