చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ బాలేదు

by John Kora |
చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ బాలేదు
X

- ప్రయాణాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి

- అది ఆటపై ప్రభావం చూపింది

- డేవిడ్ మిల్లర్ విమర్శలు

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ సరిగా లేదని దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ అన్నాడు. మ్యాచ్‌లు ఆడటం కోసం దుబాయ్, పాకిస్తాన్ మధ్య చక్కర్లు కొట్టడం వల్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మేము కూడా ప్రయాణాల కారణంగా అలసిపోయామని మిల్లర్ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ తమపై ప్రయాణాలు ఎలాంటి ప్రభావం చూపించాయో చెప్పుకొచ్చాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి బాహాటంగా విమర్శించిన తొలి క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కావడం గమనార్హం. పాకిస్తాన్‌లో పర్యటించడానికి టీమ్ ఇండియా నిరాకరించడంతో ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించారు. ఇండియా తమ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లోనే ఆడగా.. మిగిలిన జట్లు మాత్రం పాకిస్తాన్‌లో ఆడాయి. అయితే ఇండియాతో మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో పాటు ఆతిథ్య పాకిస్తాన్ కూడా దుబాయ్‌కి ప్రయాణించాల్సి వచ్చింది.

అయితే ఇండియాతో మ్యాచ్‌ ఆడకున్నా సౌత్ ఆఫ్రికా జట్టు కూడా దుబాయ్, పాకిస్తాన్ మధ్య చక్కర్లు కొట్టింది. సెమీస్ ఆడటానికి దక్షిణాప్రికా జట్టు ముందుగానే దుబాయ్ చేరుకుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై ఇండియా విజయం సాధించడంతో.. సౌత్ ఆఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోవల్సి వచ్చింది. దీనిపై డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ఇండ్లాండ్‌తో కరాచీలో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత దుబాయ్‌కు వెళ్లాము. కానీ కివీస్ ఓడిపోవడంతో వెంటనే లాహోర్‌కు రావల్సి వచ్చింది. పాకిస్తాన్, దుబాయ్ మధ్య కేవలం 40 నిమిషాల విమాన ప్రయాణమే. కానీ సాయంత్రం దుబాయ్ వచ్చి.. మళ్లీ మ్యాచ్ ఇక్కడ కాదు అని తెలిసిన తర్వాత.. మరుసటి రోజు ఉదయం 7.30కు లాహోర్ వెళ్లడం ఇబ్బందికరంగా మారిందని అన్నాడు. మేము సరిగా ప్రాక్టీస్ కూడా చేయలేకపోయామని, ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడ్డారని అన్నాడు. అయితే, కివీస్ జట్టు కూడా ఇండియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ వెళ్లి దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడింది. ఈ విషయాన్ని మిల్లర్ మర్చిపోయాడా అనే విమర్శలు వస్తున్నాయి.

Next Story