విజృంభించిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్

by Harish |
విజృంభించిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్‌ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు దగ్గర సమాధానం లేకపోయింది. హేమలత చేసిన 31 పరుగులే గుజరాత్ జట్టులో టాప్ స్కోర్. ఓపెనర్ హర్లీన్ డియోల్(22), స్నేహ్ రాణా (12) రెండెంకల స్కోరు చేయగా.. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ బెత్ మూనీ(8), లిచ్‌ఫీల్డ్(5), వేద(9), గార్డెనర్(7) దారుణంగా విఫలమవడం గుజరాత్‌ను దెబ్బ కొట్టింది. బెంగళూరు బౌలర్లలో మోలినెక్స్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. రేణుక సింగ్ 2 వికెట్లు, వారేహమ్ ఒక వికెట్ పడగొట్టారు. 108 పరుగుల లక్ష్యంతో బెంగళూరు ఛేదనకు దిగింది. టోర్నీలో యూపీ వారియర్స్‌పై గెలుపుతో బెంగళూరు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, గుజరాత్ టోర్నీలో ఇంకా బోణీ కొట్టలేదు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో పరాజయం పాలైంది.




Next Story