ఆ ఐపీఎల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ద్రవిడ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

by Harish |
ఆ ఐపీఎల్ జట్టుకు హెడ్ కోచ్‌గా ద్రవిడ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలో ఈ ఏడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవగా.. ఆ ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా అతని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను తిరిగి రాజస్థాన్‌లో చేరతాడని వచ్చిన వార్తలే నిజమయ్యాయి. ఆ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ద్రవిడ్‌తో మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ చేసుకున్నట్టు తెలిపింది.

రాజస్థాన్‌ జట్టుతో ద్రవిడ్‌కు మంచి అనుబంధం ఉంది. కెప్టెన్, కోచ్‌గా 2011-15 మధ్య ఐదు సీజన్లపాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2013 సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. రిటైర్మెంట్ తర్వాత 2014, 2015 ఎడిషన్లలో మెంటార్‌గా ఉన్నాడు. వచ్చే సీజన్లలో ద్రవిడ్.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కరతో కలిసి పనిచేయనున్నాడు. రాజస్థాన్ హెడ్ కోచ్‌గా నియామకమవడంపై ద్రవిడ్ స్పందిస్తూ.. ఇల్లుగా భావించే ఫ్రాంచైజీకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. ‘ప్రపంచకప్ తర్వాత మరొక సవాల్‌ను స్వీకరించడానికి ఇదే సరైన సమయం. అందుకు రాజస్థాన్ రాయల్స్ సరైన ప్రదేశం.’అని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed