షేర్ మార్కెట్లు.. రికార్డుల జోరు

by Harish |
షేర్ మార్కెట్లు.. రికార్డుల జోరు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా అనేక ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు సడలింపు వంటి పరిణామాలతో బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలు జోరు కొనసాగించాయి. ఈ క్రమంలో భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ రికార్డు స్థాయిలో ముగిశాయి. మంగళవారం ఉదయం నుంచే లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు చివరి వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ వంటి కీలక కంపెనీల షేర్ల మద్దతుతో మార్కెట్లు లాభాలను కొనసాగించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 221.52 పాయింట్లు ఎగసి 52,773 వద్ద ముగియగా, నిఫ్టీ 57.40 పాయింట్లు లాభపడి 15,869 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ అధిక లాభాంతో ముగిసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు బలపడగా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్స్ అత్యధికంగ 3 శాతానికి పైగా పుంజుకోగా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను సాధించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, డా రెడ్డీస్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.33 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed