ఓరుగల్లులో ఇసుకదందా..!

by  |
ఓరుగల్లులో ఇసుకదందా..!
X

దిశ ప్రతినిధి,వరంగల్: వరంగల్ నగరంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. నగరంలోని పలు కాలనీలు ఇసుక డంపులకు అడ్డాలుగా మారుతున్నాయి. అక్రమార్కులు ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటుపడి ఇసుక దందాను చూసీచూడనట్లుగా‌ వదిలేస్తున్నారు. ఫలితంగా ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది.

రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరమైన వరంగల్ వేగంగా విస్తరిస్తోంది.‌‌‌ బహుళ‌ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, హాస్పిటల్స్, ఇతర పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనా ఎఫెక్ట్ నిలిచిపోయిన నిర్మాణ పనులు లాక్‌డౌన్ ఎత్తేయడంతో నిదానంగా పుంజుకుంటున్నాయి. ఇదే సాకుగా చూపి ఇసుకాసురులు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. వరంగల్‌ సిటీకి గోదావరి, మానేరు , చలివాగుతోపాటు నగరానికి చుట్టుపక్కల ఉండే చిన్నచిన్న వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. తెచ్చిన ఇసుకను ఎక్కడికక్కడే డంప్ చేస్తున్నారు.

నగరంలో గోదావరి, మానేరు ఇసుక పేరిట జోరుగా దందా నడుస్తోంది. సిటీలోకి ప్రవేశించే ప్రధాన రోడ్లే అడ్డాగా మారుతున్నాయి. ఒక్క హసన్‌పర్తి మండల కేంద్రం నుంచి కేయూ మీదుగా వడ్డెపల్లి వరకు రోడ్ వెంట సుమారు 25 వరకు ఇసుక అడ్డాలు ఉన్నాయంటే ఇల్లీగల్ దందా ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన రోడ్లను ఆనుకుని ఉన్న పలు కాలనీల్లో సైతం డంప్‌లు ఏర్పాటు చేసుకుని బహిరంగంగానే వ్యాపారం సాగిస్తున్నారు. నగరంలోని పలు ఏరియాల్లో వందకు పైగా ఇసుక డంపులు వెలిశాయి. నగర శివారు ప్రాంతాలైన హసన్‌పర్తి, ములుగు రోడ్డు పెద్దమ్మ గడ్డ, వడ్డెపల్లి క్రాస్ వరకు కేయూసీ రోడ్డు, ఇక హంటర్ రోడ్డు, మడికొండ, మామూనూర్ ఇలా చాలా ప్రాంతలు ఇసుక డంప్‌నకు అడ్డాలుగా మారాయి. టన్నుకు రూ.1,500 నుంచి రూ. 2,000 ధర నిర్ణయించి విక్రయిస్తూ అమాయకులను దోపిడీ చేస్తున్నారు.

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు చేపట్టాల్సి పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చేష్టలుడి చూస్తున్నారు. అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం వరంగల్ పట్టణంలోకి వందల కొద్ది ట్రిప్పుల ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఏదైనా నిర్మాణం చేపడితే భవనానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా పర్మిషన్ పొంది ఇసుక తెచ్చుకోవాల్సి ఉంటుంది. అధికారుల అండతో కొంత నిబంధనలను తుంగలోతొక్కి అక్రమంగా ఇసుక డంప్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇసుక వ్యాపారుల‌ నుంచి మామూళ్లు పుచ్చుకుని‌ మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా అక్రమదందాపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇది మా పని కాదంటూ రవాణా, పోలీస్, రెవెన్యూ మైనింగ్ శాఖలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఉదాసీనంగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా, డంప్‎లపై‌ దృష్టి సారించి ఇల్లీగల్ దందాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed