రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసిక నికర లాభం రూ. 13,233 కోట్లు

by  |
రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసిక నికర లాభం రూ. 13,233 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 30.97 శాతం వృద్ధితో రూ. 13,233 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ .10,104 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇతర ఆదాయాలు 54 శాతం వృద్ధితో రూ. 4,388 కోట్లను చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో ఆర్ఐఎల్ మొత్తం ఆదాయం కొవిడ్-19 వ్యాప్తి కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 44 శాతం తగ్గి రూ. 91,238 కోట్లకు చేరుకుంది.

ఇక, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ సంస్థ వ్యయం 42 శాతం తగ్గి రూ. 87,406 కోట్లు ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ వ్యయాలు రూ. 1,50,858 కోట్లుగా నమోదైంది. ప్రప్రంచవ్యాప్తంగానూ, దేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆర్థిక కార్యకలాపాల్లో గణనీయమైన ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి త్రైమాసికంలో ఆర్ఐఎల్ గ్రూప్ కార్యకలాపాలు, ఆదాయంకు కొవిడ్-19 ప్రభావానికి లోనయ్యాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం రిలయన్స్ జియో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 2,520 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలుపింది. తొలి త్రైమాసిక ఫలితాలపై స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ, ఛైర్మన్ ముఖేశ్ అంబానీ..ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షల వల్ల తీవ్రమైన డిమాండ్‌తో తమ వ్యాపారంపై ప్రభావం చూపించింది. అయితే, తమ కంపెనీ కార్యకలాపాల్లోని ఫ్లెక్సిబిలిటీ వల్ల సాధారణ స్థాయికి చేరుకోవడానికి, మెరుగైన ఆర్థిక ఫలితాలను అందించేందుకు వీలు కలిగిందని కంపెనీ వెల్లడించింది.

రిలయన్స్ జియో…

రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం తొలి త్రైమాసికంలో నికర లాభం 182.82 శాతం వృద్ధితో రూ. 2,520 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో రూ. 891 కోట్లుగా నమోదయ్యాయి. కార్యకలాపాల ద్వారా జియో ఆదాయం 33.70 శాతం పెరిగి రూ. 16,557 కోట్లకు చేరుకోగా, వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం 55.40 శాతం పెరిగి రూ. 7,281 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో వినియోగదారుకు సగటు ఆదాయం రూ. 130.6 గా ఉండగా, ఈసారి రూ. 140.30గా నమోదైంది.

రిలయన్స్ రిటైల్..

రిలయన్స్ రిటైల్ తొలి త్రైమాసికంలో ఆదాయం 17.20 శాతం తగ్గి రూ. 31,633 కోట్లుగా నమోదైంది. వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం 47.40 శాతం క్షీణించి రూ. 1,083 కోట్లకు చేరుకుంది. అయితే, త్రైమాసికంలో పరిమితులు ఉన్నప్పటికీ రిలయన్స్ రిటైల్ నిర్వహణ లాభం సానుకూలంగా ఉందని కంపెనీ తెలిపింది. వ్యయ నిర్వహణ నిర్ణయాలతో స్థిర వ్యయం పొదుపుకు దారితీశాయ్. దీనివల్ల తక్కువ అమ్మకాలతో తక్కువ లాభాలను నమోదు చేసినట్టు కంపెనీ వెల్లడించింది.

పెట్రోకెమికల్స్..

పెట్రోకెమికల్స్ విభాగం నుంచి ఆదాయం 33 శాతం తగ్గి రూ. 25,192 కోట్లకు చేరుకుంది. ఇక, వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం 49.7 శతం క్షీణించి రూ. 4,430 కోట్లకు చేరుకుంది. ఈ విభాంలో దేశీయ డిమాండ్ క్షీణత, ఎగుమతుల అధిక వాటా మార్జిన్‌లను ప్రభావితం చేసినట్టు కంపెనీ తెలిపింది.

రిఫైనింగ్ ఆదాయం 54 శాతం తగ్గింది…

ముడిచమురు ధరలు క్షీణించడంతో రిఫైనింగ్, మార్కెటింగ్ నుంచి వచ్చిన ఆదాయం 54.10 శాతం క్షీణించి రూ. 46,642 కోట్లకు చేరుకుంది. వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం 25.80 శాతం పడిపోయి రూ. 3,818 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు సగటున 29.2 డాలర్లకు తగ్గింది.

ఆయిల్ & గ్యాస్…

చమురు, గ్యాస్ వ్యాపారం 45.2 శాతం తగ్గి రూ. 506 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం రూ. 32 కోట్లు ఉందని, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ. 207 కోట్లుగా ఉంది.

మీడియా వ్యాపారం…

కొవిడ్-19 కారణంగా మీడియా వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం 35.20 శాతం తగ్గి రూ. 807 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా ఈ విభాగంలో అడ్వర్టైజ్‌మెంట్ల కోసం ఖర్చు చేయడం ద్వారా ఆదాయం తగ్గినట్టు కంపెనీ వెల్లడించింది. వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు ఆదాయం 41.30 శాతం క్షీణించి రూ. 27 కోట్లకు చేరుకుంది. అయితే, తొలి త్రైమాసికం చివర్లో లాక్‌డౌన్ సడలింపులతో ప్రకటనల ఆదాయం కొంత మెరుగైనట్టు కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా న్యూస్ విభాగంలో ఇది మెరుగ్గా ఉందని కంపెనీ తెలిపింది.


Next Story

Most Viewed