ఏబీవీపీ నాయకుల హల్చల్.. పోలీసులకు గాయాలు

by Sridhar Babu |
ఏబీవీపీ నాయకుల హల్చల్.. పోలీసులకు గాయాలు
X

దిశ, శేరిలింగంపల్లి: నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తలకు గాయమైంది. మరికొందరికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో సోమవారం ఉదయం ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు కళాశాలలో సభ్యత్వ నమోదు కోసం అక్కడికి చేరుకున్నారు. కళాశాల వారు ముందే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో విద్యార్థి సంఘనాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ విద్యార్థులు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికిలోనైన విద్యార్థి నాయకులు కళాశాలలోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. కార్పొరేట్ కళాశాలలో లోపాలను ఎత్తి చూపుతామని, తమ సభ్యత్వానికి కళాశాలలో అనుమతి ఇవ్వడం లేదని ఏబీవీపీ నాయకులు వినోద్ ఆరోపించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed