ఆగమాగం కట్టి పక్కన పెట్టారు.. ఏం లాభం..!

by Shyam |
ఆగమాగం కట్టి పక్కన పెట్టారు.. ఏం లాభం..!
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: సాగు సమస్యలు, విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు మొదలైన సమస్యల్ని రైతులు సమష్టిగా చర్చించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఈజీఎస్, వ్యవసాయ శాఖ ద్వారా ఒక్కో వేదికకు రూ.22 లక్షల చొప్పున కేటాయించింది. జిల్లాలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలని పరుగులు పెట్టించిన అధికారులు తీరా పనులు పూర్తి చేసిన రైతు వేదికల ప్రారంభాన్ని విస్మరించారు.

జిల్లాలో 62 రైతు వేడుకలు..

కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 62 రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. బచ్చన్నపేట 7, జనగామ 7, లింగాల గణపురం 4, దేవరుప్పుల 5, స్టేషన్ ఘన్‌పూర్ 6, కొడకండ్ల 3, నర్మెట 4, పాలకుర్తి 7, రఘునాథపల్లి 7, జఫర్గడ్ 5, చిల్పూర్ 4, తరిగొప్పుల 3 చొప్పున రైతు వేదికల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఒక్కో రైతు వేదికకు రూ. 22 లక్షలు ఇందులో వ్యవసాయ శాఖ రూ. 12 లక్షలు, ఈజీఎస్ ద్వారా రూ. 10 లక్షలు కేటాయించారు. ఇందులో సమావేశపు హాలు, కార్యాలయం, మరుగుదొడ్లు, నీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది.

పూర్తయిన నిర్మాణాలు

జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణం అక్కడ అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కలరింగ్, మౌలిక వసతుల కల్పన మినహా దాదాపు పూర్తి అయ్యాయి. అయితే బిల్లుల చెల్లింపుల్లో కొంత జాప్యం జరగడంతో రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పరుగులు పెట్టించిన అధికారులు..

పల్లె ప్రగతిలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కాంట్రాక్టర్‌ను పరుగులు పెట్టించారు. తీరా నిర్మాణ పనులు పూర్తి చేస్తే చిన్న చిన్న పనులను సాకులు చూపి ప్రారంభోత్సవాలు మరి చారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ముస్తాబైన రైతు వేదికలను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Next Story