నౌహీరా షేక్ భూములు స్వాధీనం

by  |
నౌహీరా షేక్ భూములు స్వాధీనం
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హీరా గోల్డ్ కేసులో ఎండీ నౌహీరా షేక్‌కు ఉచ్చు బిగుస్తోంది. టోలీచౌకీ ఎస్ఏ కాలనీలో రూ.80కోట్ల విలువైన 81ప్లాట్లను ఈడీ శనివారం స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.5వేల కోట్ల హీరా గోల్డ్ మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెల్సిందే. తన వద్ద నుంచి కోటి రూపాయలు మదుపు చేయించుకున్న హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పెట్టుబడి, లాభం ఇవ్వకుండా మోసం చేసిందంటూ బంజారాహిల్స్‌‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని తెలంగాణ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ చట్టంలోని ప్రైజ్‌, చిట్స్‌, మనీ సర్క్యులేషన్‌ నిషేధం సెక్షన్ల ఆధారంగా దర్యాప్తు చేశారు. చట్టాలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించడంతో ఢిల్లీలో ఉన్న నౌహీరా షేక్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

నౌహీరా షేక్ ఎలాంటి పెట్టుబడులు, లావాదేవీలు లేకుండానే 15కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తేలింది. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్ల ఆధారంగానే పలుచోట్ల ఆస్తులను కూడబెట్టింది. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల వివరాలను సేకరించిన సీసీఎస్‌ పోలీసులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దేశ వ్యాప్తంగా 60 కేసులు నమోదు కాగా, అందులో తెలంగాణలోనే 10 కేసులు ఉన్నాయి. నౌహీరా షేక్, ఆమె కంపెనీల పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో సుమారు 240 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టు, దేశ- విదేశాలలో 43ప్రాంతాల్లో స్థిరాస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. తిరుపతిలో రూ.100 కోట్లు, హైదరాబాద్‌లో రూ.500 కోట్లు, దుబాయ్‌లో రూ.400 కోట్లు ఆస్తులు ఉన్నట్టు తేలింది. ముందుగా గుర్తించిన రూ.1000 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోవాలని భావించగా.. ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.


Next Story

Most Viewed