అక్కడ నో కరోనా!

by  |
అక్కడ నో కరోనా!
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుడుతుంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం నేటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు. సరిహద్దు జిల్లాగా ఉన్న హైదరాబాద్ మహానగరానికి ఇక్కడి నుంచి వేలమంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారి సంఖ్య సైతం అధికమే. అయినా జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సరిహద్దు జిల్లాల్లో కుప్పలుగా కేసులు..

వాస్తవానికి యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఒక్క కేసు నమోదు కాకపోవడం పట్ల అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇక్కడి నుంచి నిత్యం సరిహద్దు జిల్లాలకు రాకపోకలు సాగిస్తారు. సరిహద్దు జిల్లాల్లో కేసులు కుప్పలు తెప్పలుగా నమోదైనా.. ఇక్కడ ఒక్కటంటే.. ఒక్క కేసు నమోదు కాలేదు. సరిహద్దు జిల్లాలుగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో 368 కేసులు, మరో సరిహద్దు జిల్లా సూర్యాపేటలో 43 కేసులు, నల్లగొండ జిల్లాలో 12 కేసులు, జనగామలో రెండు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించిన మకిలీ జిల్లాలోకి ప్రవేశించకపోవడం గమనార్హం.

మర్కజ్ ప్రార్థనలకు 12 మంది..

యాదాద్రి-భువనగిరి జిల్లా నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు 12 మంది వెళ్లి వచ్చారు. వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు గానీ, కేసులు కానీ నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా మర్కజ్ ప్రార్థనలు కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ జిల్లాలో 12 మంది వెళ్లి వచ్చినప్పటికీ ఆ తరహా కేసులేమి లేవు. ఈ 12 మందితో పాటు వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులను హోం క్వారంటైన్‌లో ఉంచి పలుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతా నెగిటివ్ వచ్చింది. వీరితోపాటు జిల్లాకు విదేశాల నుంచి 101 మంది, పలు రాష్ట్రాల నుంచి 618 మంది వచ్చారు. వీరందరినీ అధికార యంత్రాంగం గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచింది. క్వారంటైన్ గడువు సైతం ముగిసింది. పలుమార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందరికి నెగిటివ్ రావడంతో జిల్లా కరోనా ఫ్రీ జోన్‌గా మారింది.

కరోనాకు దారి లేకుండా..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం చేయగానే జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడా కట్టుదిట్టం చేసింది. ప్రధానంగా జిల్లాకు ఉన్న సరిహద్దుల జిల్లాల దారులన్నింటినీ మూసేసి కరోనాకు దారి లేకుండా చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పడు వారు హోం క్వారంటైన్ పాటించేలా చేశారు. లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతో కరోనా కేసులు నమోదు కాలేదు.

Tags: Nalgonda, Yadadri, No Corona, Officers, Quarantine, Tests, Negative, Confirmation



Next Story

Most Viewed