Wayanad : చలియార్ నదిలో 198 డెడ్‌బాడీస్ లభ్యం

by Hajipasha |
Wayanad : చలియార్ నదిలో 198 డెడ్‌బాడీస్ లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 358కు చేరింది. అయితే చూరల్‌మల గ్రామానికి చెందిన 40 రోజుల పసికందు(అనారా), ఆమె ఆరేళ్ల సోదరుడు(మహ్మద్ హయాన్) మృత్యుంజయులుగా నిలిచారు. రెస్క్యూ టీం సాహసోపేతంగా వ్యవహరించి వారిలో ఒకరిని ప్రాణాలతో రక్షించింది. తంజీర చూరల్‌మల వాస్తవ్యురాలు. కొండచరియలు విరిగిపడ్డాక వరదనీరు ముంచెత్తడంతో ఆమె ఇంట్లోని తల్లి, అమ్మమ్మ అందులో కొట్టుకుపోయారు. ఈక్రమంలో ఏం చేయాలో అర్థంకాక తన పిల్లలు అనారా, హయాన్‌లతో తంజీర ఉరుకులు పరుగులతో సమీపంలో ఉన్న ఓ భవనం పైకప్పు పైకి పరుగులు తీసింది. ఈక్రమంలో కుమారుడు హయాన్ నీళ్లలోకి జారిపడి కొట్టుకుపోయాడు. లక్కీగా ఓ బావికి కట్టి ఉన్న వైరులో చిక్కుకోవడంతో.. వరద ప్రవాహంలో కొట్టుకుపోకుండా హయాన్ బతికి బట్టకట్టాడు. అతడిని గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తీసుకొచ్చి తల్లి తంజీరకు అప్పగించారు. అయితే తన తల్లి, అమ్మమ్మలను కోల్పోయిన విషాదం మాత్రం తంజీరకు మిగిలింది.

చలియార్ నదిలో.. ఇప్పటివరకు 198 డెడ్‌బాడీస్ లభ్యం

వయనాడ్ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలకు చెందిన దాదాపు 518 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందగా 209 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 206 మంది ఆచూకీ తెలియడం లేదు. తాజాగా శనివారం చలియార్ నదిలో 9 డెడ్‌బాడీస్ లభ్యమయ్యాయి. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించలేదు. ఇప్పటివరకు చలియార్ నదిలో 198 డెడ్‌బాడీస్ దొరకడం విషాదకరం. ఈ విపత్తు వల్ల ఏడుగురు పిల్లలు అనాథలుగా మారారని కేరళ మంత్రి రియాస్ వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల పరిధిలోని జీవిత బీమా పాలసీదారుల కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా క్లెయిమ్ అమౌంటును మంజూరు చేయాలని ఎల్‌ఐసీ సహా ఇతర ప్రభుత్వరంగ బీమా కంపెనీలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ముందక్కై, చూరల్ మల ప్రాంతాల్లోని బాధిత ప్రజలకు సహాయ సహకారాలను అందించేందుకు రూ.4 కోట్ల నిధులను కేరళ ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. బాధితులకు సహాయం అందించే అంశాల పర్యవేక్షణకు ‘హెల్ప్ ఫర్ వయనాడ్’ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

నటుల విరాళాలు

తాజాగా శనివారం రోజు ప్రముఖ నటుడు మోహన్ లాల్ వయనాడ్‌లో జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితుల సంక్షేమం కోసం ఆయన రూ.3 కోట్ల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌..కోజికోడ్‌ నుంచి రోడ్‌ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. తమిళ నటులు సూర్య, జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు, మమ్ముట్టి-దుల్కర్ రూ.40 లక్షలు, కమల్ హాసన్ రూ.25 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.

సైంటిస్ట్ సోమన్‌ విశ్లేషణ ఇదీ..

వయనాడ్‌ ఘటనకు సంబంధించి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ రిటైర్డ్ సైంటిస్ట్ సోమన్‌ కీలక వివరాలను తెలిపారు. ముందక్కై, చూరల్ మల ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయని చెప్పారు. గతంలో కూడా ఇక్కడ కొండచరియలు విరిగి నదిలో పడి ఉండొచ్చని.. అలా నదీ ప్రవాహం దిశ మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారని ఆయన విశ్లేషించారు. తిరిగి ఆ నదీ ప్రవాహం.. గతంలో ప్రవహించిన దిశకు మళ్లినందు వల్లే ఈ విషాద దుర్ఘటన చోటు చేసుకొని ఉండొచ్చన్నారు. కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైన వెల్లరిమల ప్రాంతం సముద్ర మట్టానికి 2 వేల అడుగుల ఎత్తులో ఉందని పేర్కొన్నారు. ముందక్కై, చూరల్ మల ప్రాంతాలు 900 నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉన్నాయని తెలిపారు. దీంతో కొండ పైనుంచి రాళ్లు చాలా వేగంగా ఆ ప్రాంతాలపైకి దూసుకొచ్చి ఉంటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed