India: జనాభా పెరుగుదల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ: నివేదిక

by Harish |
India: జనాభా పెరుగుదల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ: నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అవడం, కుటుంబ బాధలు, ఒత్తిడి వంటి ఇతర కారణాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నుంచి విడుదలైన డేటా ప్రకారం, భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ప్రమాదకర రేటుతో పెరుగుతున్నాయి. ముఖ్యంగా జనాభా పెరుగుదల రేటు కంటే కూడా మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం.

మొత్తంగా చూసినట్లయితే ఆత్మహత్యల సంఖ్య ఏటా 2 శాతం పెరుగుతుండగా, వాటిలో విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4 శాతం పెరిగాయని, నివేదిక తెలిపింది. గత రెండు దశాబ్దాలలో, విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు వార్షిక రేటుతో 4 శాతం పెరిగాయి. 0-24 సంవత్సరాల వయస్సు గల వారి జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గింది, అయితే విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044కి పెరగడం గమనార్హం. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో దాదాపు 53 శాతం మంది మగ విద్యార్థులు ఉన్నారు. 2021 నుంచి 2022 మధ్య మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, విద్యార్థినుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయని నివేదికలో వెల్లడైంది.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో.. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి, ఇవి జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతుగా నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా మొత్తం ఆత్మహత్యల్లో 29 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న రాజస్థాన్‌లోని కోటా ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పోలీసులు నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదికల (ఎఫ్‌ఐఆర్‌లు) ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ డేటాను రూపొందించగా, దీనిని "స్టూడెంట్ సూసైడ్స్: యాన్ ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా" పేరుతో తాజాగా IC3 కాన్ఫరెన్స్, ఎక్స్‌పో 2024 సందర్భంగా విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed