'దేశం మొత్తం మణిపూర్‌లా మారిపోతుంది'.. తొలి పాడ్‌కాస్ట్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్

by Vinod kumar |
దేశం మొత్తం మణిపూర్‌లా మారిపోతుంది.. తొలి పాడ్‌కాస్ట్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్
X

చెన్నయ్: త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కూటమి ‘ఇండియా’ తప్పనిసరిగా గెలవాలని, లేదంటే, దేశం మొత్తాన్నీ బీజేపీ మణిపూర్, హర్యానాలా మార్చేస్తుందని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ప్రధాని మోడీ ‘మన్‌ కీ బాత్’కు పోటీగా స్టాలిన్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తొలి ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇందులో బీజేపీ ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ‘దేశ పౌరులందరి ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా నెరవేర్చలేదు’ అని మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కూల్చి, వాళ్ల స్నేహితులను అప్పగించడం వంటి అంశాలను కప్పిపుచ్చేందుకు బీజేపీ మత విద్వేషాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సామాజిక న్యాయం, సామరస్యం, సమైఖ్యవాదం, లౌకిక రాజకీయాలు, సామ్యవాదాన్ని పునరుద్ధరించడానికే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పిన ఆయన.. బీజేపీని ఇప్పటికైనా ఆపకపోతే దేశాన్ని ఇక ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. కాగా, స్టాలిన్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. దేశాన్ని మతం, కులం, భాషల ప్రాతిపదికగా డీఎంకే విభజిస్తోందని ఆరోపించింది. అలాగే, పౌరుల ఖాతాల్లో రూ.15లక్షలు జమచేస్తామని ప్రధాని మోడీ ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. స్టాలిన్ పాడ్‌కాస్ట్ మొత్తం అబద్ధాలతో నిండి ఉందని తెలిపింది.

Advertisement

Next Story