Sheikh Hasina: హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్‌సీబీఏ విజ్ఞప్తి

by vinod kumar |
Sheikh Hasina: హసీనా, రెహానాలను అరెస్టు చేయండి.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎస్‌సీబీఏ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్టు చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎస్‌సీబీఏ ఆడిటోరియంలో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపించారు. అలాంటి వారితో సానుకూల సంబంధాలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. భారత్ దేశ ప్రజలతో బంగ్లాదేశ్ సానుకూల సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాబట్టి వెంటనే హసీనా, రెహనాలను వెంటనే తమకు అప్పగించాలని కోరారు.

రాజకీయ కార్యకలాపాలు, అవినీతికి పాల్పడిన బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారంలోగా రాజీనామా చేయాలని ఖోకాన్ డిమాండ్ చేశారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం హయాంలో నియామకాలు సరిగా జరగలేదన్నారు. అటార్నీ జనరల్ సహా, రాష్ట్ర న్యాయ అధికారులు, అవినీతి నిరోధక కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫ్ లు కూడా వెంటనే రిజైన్ చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ఖైదీలను సైతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పలువురు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) అనుకూల న్యాయవాదులు సైతం హాజరయ్యారు.

కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాల వల్ల ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఢిల్లీలోనే ఉన్నారా లేక వేరే ప్రదేశానికి వెళ్లారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే షేక్ హసీనా ఇండియాలోనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర పరిపాలన ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు.

Next Story

Most Viewed