RBI MPC Meet: వరుసగా తొమ్మిదోసారి.. రెపోరేటు యథాతథం

by Shamantha N |
RBI MPC Meet: వరుసగా తొమ్మిదోసారి.. రెపోరేటు యథాతథం
X

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. పరపతి విధాన కమిటీ సమావేశ(MPC) నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. మంగళవారం ప్రారంభమైన ఎంపీసీ సమావేశం గురువారం వరకు కొనసాగింది. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపోరేటుని ఈ విధంగానే కొనసాగిస్తుండటం గమనార్హం. వరసుగా తొమ్మిదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఎంపీసీ కీలక నిర్ణయాలు ఏంటంటే?

- 2024-25లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా. రెండో త్రైమాసికంలో 4.4%, మూడో త్రైమాసికంలో 4.7%, నాలుగో త్రైమాసికంలో 4.3 శాతంగా ఉండే అవకాశం.

- 2024-25లో జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం. ఒకటి, రెండు, నాలుగో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో క్వార్టర్‌లో 7.3 శాతంగా ఉండే అవకాశం.

- 2022-23లో జీడీపీలో 2 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2023-24 నాటికి 0.7 శాతానికి తగ్గింది.

- మార్కెట్‌ అంచనాలు, ఆర్‌బీఐ విధానాలకు మధ్య సయోధ్య కుదురుతోంది.

- ఏప్రిల్‌ - మేలో స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం.. జూన్‌లో మళ్లీ పెరిగింది. ఆహార పదార్థాల ధరలు పెరగడమే ద్రవ్యోల్బవానికి ప్రధాన కారణం.

- మొబైల్ టారిఫ్ ధరలు, పాల ధరలు జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

- భారతదేశ విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2 నాటికి రికార్డు స్థాయిలో 675 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

- అనధికార రుణాలను నిరోధించడానికి డిజిటల్ లెండింగ్ యాప్‌ల పబ్లిక్ రిపోజిటరీని ప్రతిపాదన.

- యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు.

- నిరంతర చెక్‌ క్లియరింగ్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదన.

- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విస్తరణ అసమతుల్యంగా ఉంది. కొన్ని కేంద్ర బ్యాంకులు ఇంకా కఠిన విధానాలను కొనసాగిస్తున్నాయి. పెరుగుతున్న అప్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సవాల్‌గా మారాయి.

- భారత సేవా రంగ కార్యకలాపాలు బలంగా ఉన్నాయి.

- బ్యాంకు రుణాల విస్తరణ నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి. బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లు ఆరోగ్యకరంగా ఉన్నాయి. ప్రభుత్వం మూలధనం వ్యయాలపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి.

- నైరుతి రుతుపవనాల వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆశాభావం.

- భారత కరెన్సీ రూపాయి మారకం విలువ పరిమిత శ్రేణిలోనే కదలాడుతోంది.

- ఆర్థిక సంస్థలు కొన్నిసార్లు టాపప్‌ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో నిబంధనలను పాటించడం లేదు. దీన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అరికట్టాలి.

- ఇటీవల గ్లోబల్‌ టెక్‌ ఔటేజ్‌.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తుచేసింది.

Advertisement

Next Story