50 కోట్ల దాటిన కుంభమేళా భక్తులు

by John Kora |
50 కోట్ల దాటిన కుంభమేళా భక్తులు
X

- శుక్రవారం ఒక్క రోజే 92 లక్షల మంది స్నానాలు

- ఇది చారిత్రాత్మక సందర్భం

- యూపీ సీఎం ఆదిత్యా నాథ్ వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే త్రివేణి సంగమం వద్ద 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారని ఆయన పేర్కొన్నారు. మహా కుంభమేళా మొదలైన దగ్గరనుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు చెప్పారు. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనాలు పాల్గొనలేదని, ఇదొక చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం ఆదిత్యానాధ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించిన వారి సంఖ్య.. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల జనాభా కంటే ఎక్కువని చెప్పారు.

ఇలాంటి గొప్ప మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న సాధువులు, సన్యాసులు,కల్పవాసులు, భక్తులకు సీఎం ఆదిత్యానాథ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసిన కుంభమేళ అధికారులు, స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసులు, పారిశుథ్య కార్మికులు, వాలంటీర్లు, మతపరమైన సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తీర్థరాజ్ ప్రయాగ్ భక్తుల కోరికలన్నీ నెరవేర్చాలని, ప్రపంచ మానవాళికి శాంతిని కలుగజేయాలని సీఎం ఆదిత్యానాథ్ ఆకాంక్షించారు.

కాగా, ప్రతీ 12 ఏళ్లకు నిర్వహించే మహా కుంభమేళా ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఈ ఆధ్యాత్మిక సమ్మేలనం కొనసాగనుంది. కాగా మొదటి కుంభమేళాకు 40 నుంచి 45 మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. అయితే మరో 12 రోజుల కార్యక్రమం ఉండగానే 50 కోట్ల సంఖ్యను దాటేయడం విశేషం. ప్రయాగ్‌రాజ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది భక్తులు వస్తున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed