Jammu kashmir: కశ్మీర్‌లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.. మల్లికార్జున్ ఖర్గే

by vinod kumar |
Jammu kashmir: కశ్మీర్‌లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.. మల్లికార్జున్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. కశ్మీర్, లడఖ్‌లపై బీజేపీ అనుసరిస్తున్న విధానం కశ్మీరీలను గౌరవించడం లేదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి సోమవారంతో ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్‌ను పూర్తిగా ఏకీకృతం చేయడానికి, ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధిని పెంచడానికి, వేర్పాటువాదాన్ని నిరోధించడానికి సహాయపడుతుందని మోడీ ప్రభుత్వం పేర్కొంది. కానీ పరిస్థితులు మాత్రం వారు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. 2019 నుంచి 683 ఘోరమైన ఉగ్రదాడులు జరిగాయని, ఫలితంగా 258 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారని తెలిపారు. అంతేగాక170 మంది పౌరుల ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ప్రధాని మోడీ మూడో సారి ప్రమాణం చేసినప్పటి నుంచి జమ్మూ ప్రాంతంలో 25 ఉగ్రదాడులు జరిగాయని, 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారని తెలిపారు. గత కొన్నేళ్లుగా కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం ఆనవాయితీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి జమ్మూ కాశ్మీర్‌లో 65 శాతం ప్రభుత్వ శాఖల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. కశ్మీర్‌లో నిరుద్యోగం రేటు 10 శాతంగా ఉందన్నారు. 2021లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, కేవలం 3 శాతం పెట్టుబడులు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.

సుప్రీంకోర్టు గడువు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా ప్రజలు తమ ప్రతినిధులను సొంతంగా ఎన్నుకోవాలని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కాగా, సెప్టెంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే అప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో లేదో కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed