స్మృతి సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది పాక్ వ్యక్తే.. ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ

by vinod kumar |
స్మృతి సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది పాక్ వ్యక్తే.. ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: సియాచిన్‌ వీరుడు కెప్టెన్‌ అన్షుమాన్‌ సింగ్‌ భార్య స్మృతి సింగ్‌పై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సృతి సింగ్ పై చేసిన వ్యాఖ్యలు అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనం. ఈ వ్యాఖ్యలు మేమే సోషల్ మీడియాలో గమనించాం. వెంటనే దానిపై స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఆ వ్యక్తి పాక్‌కు చెందిన వ్యక్తి కావచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికైనా అవమానకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

కాగా, గత ఏడాది సియాచిన్ గ్లేసియర్‌లోని సైనిక శిబిరంలో జరిగిన అగ్నిప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు మరణానంతరం భారతదేశ రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర పురస్కారం లభించింది. ఈ నెల 5వ తేదీన అన్షుమాన్ భార్య స్మృతి సింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును స్వీకరించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఈ ఫొటోపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్లూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story