హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్

by Dishanational1 |
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తన అరెస్టుకు వ్యతిరేకంగా జార్ఖండ్ హైకోర్టు తన రిట్ పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల హేమంత్ సోరెన్ తన అరెస్టును సవాలు చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది తిరస్కరించబడింది. దీనిపై సోమవారం హేమంత్ సోరెన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. పిటిషన్‌ను అత్యవసరంగా లిస్టింగ్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ను విడుదల చేయాలని సిబల్ అన్నారు. అభ్యర్థనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈదీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉన్నారు.

Next Story

Most Viewed