CM : ‘మహాయుతి’ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పేసిన ఫడ్నవిస్

by Hajipasha |
CM : ‘మహాయుతి’ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పేసిన ఫడ్నవిస్
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో అధికార ‘మహాయుతి’ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అని ఇటీవలే శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే సంధించిన ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. సీఎం అభ్యర్థి ఏక్‌నాథ్ షిండేయే అని, ఆ విషయంలో ఎలాంటి మార్పూ లేదని బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. బుధవారం ముంబైలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

‘‘మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిని ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం అభ్యర్థి ఏక్‌నాథ్ షిండే ఇక్కడే కూర్చొని ఉన్నారు’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ ఈసందర్భంగా వెల్లడించారు. ‘‘మమ్మల్ని ప్రశ్నించడం ఆపేసి.. సీఎం అభ్యర్థి పేరును మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రకటించాలి. శరద్ పవార్‌కు ఇదే నా ఛాలెంజ్’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో గెలుస్తామనే విశ్వాసమే ఎంవీఏ కూటమికి లేదు. అందుకే వాళ్లు సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు సంకోచిస్తున్నారు’’ అని ఫడ్నవిస్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రగతి నివేదికను వారు విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed