CBI Office: సీబీఐ ఆఫీసులోనే చోరీ.. తలుపులు, కిటీకీలు సహా మొత్తం లూటీ

by vinod kumar |
CBI Office: సీబీఐ ఆఫీసులోనే చోరీ.. తలుపులు, కిటీకీలు సహా మొత్తం లూటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అత్యంత క్లిష్టమైన నేరాలను దర్యాప్తు చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులకే దొంగలు షాకిచ్చారు. ఏకంగా సీబీఐ కార్యాలయంలోనే చోరీకి పాల్పడ్డారు. అంతేగాక ఆఫీసులోని కబోర్డులు, తలుపులు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్‌, ఇతర సామగ్రితో సహా అంతా లూటీ చేశారు. కేవలం ఆఫీసు గోడలను మాత్రమే మిలిల్చారు. త్రిపుర (Tripura) రాజధాని అగర్తలా (Agarthala) లో ఉన్న శ్యామలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్సులోని సీబీఐ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగర్తలాలోని సీబీఐ ఆఫీసు ఐదు నెలలుగా మూసి ఉంది. అయితే ఈనెల 11వ తేదీన పని నిమిత్తం అధికారులు ఆఫీసుకు వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన వారికి భారీ షాక్ తగిలింది. ఆఫీసులో గోడలు తప్ప ఇంకేం లేకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సీబీఐ ఎస్సై అనురాగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానిక ప్రాంతాల నుంచి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఎనిమిది స్టీల్ అల్మారాలు, ఏడు కుర్చీలు, నాలుగు కిటికీలు, ఒక గీజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ ఆఫీసులో చోరీ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed