కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర..ఢిల్లీ మంత్రి అతిశీ

by vinod kumar |
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర..ఢిల్లీ మంత్రి అతిశీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తిహార్ జైలులోనే చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా పడిపోయాయని, అయినప్పటికీ వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీ ఓర్వలేకనే ఆయనను తప్పుడు కేసుల్లో ఇరికించారని తెలిపారు. అంతేగాక కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారన్నారు. 30 ఏళ్లుగా డయాబెటిక్ పేషెంట్‌గా ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను కోర్టు జోక్యం చేసుకునే వరకు ఇన్సులిన్ తీసుకోవడానికి, డాక్టర్‌తో మాట్లాడేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదన్నారు. కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘చక్కెర స్థాయి తక్కువగా ఉండటం వల్ల కేజ్రీవాల్‌కు ఏదైనా జరగొచ్చు. ఆయన బరువు సైతం 8.5కేజీలు తగ్గారు’ అని తెలిపారు.



Next Story