75 ఏళ్ల ఏజ్‌ లిమిట్ అద్వానీకేనా.. మోడీకి వర్తించదా ? : కేజ్రీవాల్

by Hajipasha |
75 ఏళ్ల ఏజ్‌ లిమిట్ అద్వానీకేనా.. మోడీకి వర్తించదా ? : కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ను మోడీ ప్రారంభించారని, దేశంలో మరో బలమైన నాయకుడు ఉండకూడదని ప్రధాని భావిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. మోడీ మరోసారి ప్రధాని అయితే.. యూపీ సీఎంగా యోగిని తొలగించి, మరొకరిని రంగంలోకి దింపుతారన్నారు. మధ్యంతర బెయిల్‌పై తిహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తొలిసారిగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రతిపక్ష నేతలనే కాకుండా.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందన్నారు. ‘‘అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, ఖట్టర్, రమణ్ సింగ్‌.. వీళ్లందరి రాజకీయ జీవితాలను ముగించారు. మోడీ తర్వాతి లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోడీ మరోసారి గెలిస్తే.. రెండు నెలల్లోనే యూపీ ముఖ్యమంత్రిని మార్చేస్తారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మమత, స్టాలిన్, తేజస్వి, థాక్రేలను జైల్లో పెడతారు..

ఇప్పటికే తమ ఆప్ మంత్రులతో పాటు హేమంత్ సోరెన్, తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు జైల్లో ఉన్నారని చెప్పిన కేజ్రీవాల్.. బీజేపీ మరోసారి గెలిస్తే మమతా బెనర్జీతో పాటు సీఎం ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, సీఎం పినరయి విజయన్, ఉద్ధవ్ థాక్రేలను కూడా జైల్లోపెడతారని వ్యాఖ్యానించారు. ‘‘ఒక పార్టీ నుంచి నలుగురు అగ్ర నేతలు జైలుకెళ్తే.. అది మనుగడ సాగించగలదా ? ఆప్‌ను మట్టికరిపించాలని ప్రధాని భావిస్తున్నారు. ఆప్‌ ఒక్కటే దేశానికి అద్భుతమైన భవిష్యత్తును అందించగలదని మోడీ కూడా నమ్ముతున్నారు. ఆమ్‌ ఆద్మీ ఒక పార్టీ కాదు. సిద్ధాంతం. మీరెంత అణగదొక్కితే మేం అంత పైకి లేస్తాం’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ‘‘విపక్ష ఇండియా కూటమికి నాయకుడు ఎవరు? అని బీజేపీ పదేపదే అడుగుతోంది. మరి వారి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? వచ్చే సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు నిండుతాయి. బీజేపీలో ఆ వయసు వారు రిటైర్మెంట్‌ తీసుకోవాలని ప్రధానమంత్రే రూల్‌ పెట్టారు. ఆ రూల్ ఆధారంగా అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, సుమిత్రా మహజన్‌ లాంటి వారిని పక్కనబెట్టారు. మరి మోడీ కూడా రిటైర్‌ అవుతారా? అలాగైతే ప్రధానిగా వారిలో ఎవరిని ఎన్నుకుంటారు?’’ అని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. ‘‘అమిత్ షా కోసమే ప్రధాని మోడీ ఇప్పుడు ఓట్లు అడుతున్నారు.. మరి మోడీ గ్యారంటీని షా నెరవేరుస్తారా?’’ అని ఆయన దుయ్యబట్టారు.

అందుకే రాజీనామా చేయలేదు..

‘‘ప్రజాస్వామ్యాన్ని జైలులో పెడితే.. అక్కడి నుంచే ప్రజాస్వామ్య పాలన సాగుతుందని చెప్పేందుకు నేను రాజీనామా చేయలేదు. జైలు నుంచే నియంతపై పోరాటం చేశా. బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నేను దేశమంతా ప్రచారం చేస్తా’’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ‘‘భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎప్పుడైతే ఓ నియంత మొత్తం అధికారాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించాడో.. అతడిని ప్రజలు నిర్మూలించారు. ఇప్పుడు కూడా ఓ నియంత (ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ) పుట్టుకొచ్చాడు. అతడు ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని అనుకుంటున్నాడు. అతడికి ఓటేయొద్దని 140 కోట్ల మంది భారతీయుల్ని వేడుకోవడానికి ముందుకొచ్చాను’’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.



Next Story