భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి

by Gopi |
భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి
X

దిశ, నేషనల్ బ్యూరో: భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. దీని గురించి అస్సాం డీజిపీ జీపీ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం ప్రభుత్వంలో హోం అండ్ పొలిటికల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి శిలాదిత్య చెటియా మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన గురించి తెలిసిన తక్షణం కొన్ని నిమిషాలకే శిలాదిత్య ఆత్మహత్య చేసుకున్నారు. చాలాకాలంగా ఆయన భార్య క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె మృతి చెందడంతో శిలాదిత్య దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన మరణంతో అస్సాం పోలీసు కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. ఇది దురదృష్టకర సంఘటన. ఐపీఎస్ అధికారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన శిలాదిత్య చెటియా గత నాలుగు నెలలుగా భార్య అనారోగ్యం రీత్యా సెలవులో ఉన్నారు. అస్సాం ప్రభుత్వంలో కార్యదర్శిగా చేరకముందు శిలాదిత్య రాష్ట్రంలోని టిన్సుకియా, సోనిత్‌పూర్ జిల్లాల ఎస్‌పీగా పనిచేశారు. ఆయన మరణంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Next Story