ఎండ వేడిని తట్టుకోలేక ఢిల్లీలో 5 గురు, నోయిడాలో 10 మంది మృతి

by Harish |   ( Updated:2024-06-19 08:22:53.0  )
ఎండ వేడిని తట్టుకోలేక ఢిల్లీలో 5 గురు, నోయిడాలో 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడిచిన 72 గంటల్లో ఎండల వేడిని తట్టుకోలేక ఢిల్లీలో 5 మంది మరణించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఇద్దరు, రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రిలో ఇద్దరు, లోక్ నాయక్ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. అలాగే, తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితుల వలన నోయిడాలో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నగరంలోని ఆసుపత్రులకు ఎండ వేడి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.

NJP హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రీతు సక్సేనా మాట్లాడుతూ, హీట్ వేవ్ బాధితులు ప్రతిరోజూ ఎనిమిది నుండి 10 మంది వస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంటుండంతో ICUలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వేడి గాలుల ప్రభావానికి శరీరం ఎక్కువగా గురికావడంతో వృద్ధుల నుంచి మొదలుకుని యువత కూడా తీవ్ర అలసటతో బాధపడుతున్నారు.

ఢిల్లీలో చాలా మంది శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ హీట్ స్ట్రోక్‌కు గురవుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించే సామర్థ్యం తగ్గడం వల్ల 55 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వేడి-సంబంధిత అనారోగ్యాలకు గురవుతున్నారని ఒక డాక్టర్ చెప్పారు. మరోవైపు ఇదే వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఢిల్లీలో తీవ్ర హీట్‌వేవ్ పరిస్థితులు ఉన్నాయి. సోమవారం ఉష్ణోగ్రతలు 45.2 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి, ఇది కాలానుగుణ సగటు కంటే 6.4 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed