Pak News: పాక్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 36 మంది మృతి

by S Gopi |
Pak News: పాక్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 36 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశం పాకిస్తాన్‌లోని నార్త్‌వెస్ట్ ప్రాంతంలో స్థలం కోసం రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. వందమందికి పైగా గాయపడ్డారని ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. అప్పర్ కుర్రం జిల్లాలోని బోషెరా గ్రామంలో ఐదు రోజుల క్రితం భారీ ఘర్షణలు మొదలయ్యాయి. ఇవి గిరిజనులు, మత సమూహాల మధ్య చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలోని కుర్రం జిల్లాలో గత ఐదు రోజుల్లో జరిగిన గిరిజన ఘర్షణల్లో 36 మంది మరణించారని, 162 మంది గాయపడ్డారని డిప్యూటీ కమిషనర్‌ కుర్రం జావేదుల్లా మెహసూద్‌ తెలిపారు. అనంతరం గిరిజన పెద్దలు, సైనిక నాయకత్వం, పోలీసులు, జిల్లా యంత్రాంగం సహాయంతో అధికారులు బోషెరా, మలిఖేల్, దండార్ ప్రాంతాలలో షియా, సున్నీ తెగల మధ్య సంధి కుదిర్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. గిరిజన వర్గాలకు చెందిన వారిని ఖాళీ చేయించారు. ఆ ప్రాంతాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల క్రితం భూ వివాదంపై ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలు పీవార్, తాంగీ, బలిష్‌ఖేల్, ఖార్ కలే, మక్బాల్, కుంజ్ అలీజాయ్, పారా చమ్కాని, కర్మన్‌తో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఇరు తెగలవారు మోర్టార్ షెల్స్, రాకెట్ లాంచర్లతో సహా భారీ, అధునాతన ఆయుధాలను ఒకరిపై ఒకరు ప్రయోగించినట్టు స్థానికులు చెప్పారు. కుర్రం గిరిజన జిల్లాలోని ప్రధాన నగరాలైన పరాచినార్, సద్దాలపై కూడా మోర్టార్, రాకెట్ షెల్స్‌ పేల్చినట్లు వారు పేర్కొన్నారు. అన్ని విద్యా సంస్థలు, మార్కెట్లు మూసివేయబడ్డాయి, ప్రధాన రహదారులపై పగటిపూట కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed