బాసర లో ఘనంగా మూల నక్షత్రం వేడుకలు

by Aamani |
బాసర లో ఘనంగా మూల నక్షత్రం వేడుకలు
X

దిశ,బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో మూల నక్షత్రం వేడుకలు ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ద‌ర్శనానంత‌రం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాసర క్షేత్రాన్ని ద‌శ‌ల‌వారీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 8 కోట్లతో ఆలయ అతిథి గృహాలు నిర్మించామన్నారు.

మ‌రో 42 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయ విస్తరణ పనులలో భాగంగా క్యూ కాంప్లెక్స్ గోదావరి న‌ది స‌మీపాన బాత్ రూం ల‌తో పాటు టీటీడీ అతిథి గృహం పనులు చేస్తామని అన్నారు. బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసుకున్నవారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సౌక‌ర్యాలను మ‌రింత మెరుగుప‌రిచేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed