ఒకే ఇంటిలో 185 మంది సభ్యులు.. ఆరు తరాల వారు కలిసే జీవిస్తున్నారు!

by Javid Pasha |   ( Updated:2024-06-23 08:14:39.0  )
ఒకే ఇంటిలో 185 మంది సభ్యులు.. ఆరు తరాల వారు కలిసే జీవిస్తున్నారు!
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతగా లేదనే చెప్పాలి. ఎక్కడైనా ఉందంటే.. మహా అయితే ఒకటి రెండు తరాలవాళ్లు కలిసి ఉంటారు. ఆ తర్వాతి జనరేషన్‌ వచ్చేసరికైనా తప్పకుండా వేరు పడతారు. కానీ రాజస్థాన్‌లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు భిన్నం. ఆరు తరాల నుంచి ఈ కుటుంబంలో వేరు కాపురాలు అనేవే లేవట. ప్రస్తుతం పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిపి 185 మంది ఉన్నప్పటికీ వీరంతా ఒకే ఇంటిలో కలిసి నివసిస్తున్నారు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్ నుంచి సుమారు 36 కిలీమీటర్ల దూరంలో నసీరాబాద్‌కు సమీపంలో రామ్‌సర్ అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలోని బాగ్దీ కుటుంబంలో ఆరు తరాలవారు ఇప్పటికీ కలిసే జీవిస్తున్నారు. 65 మంది పురుషులు, 60 మంది చిన్నారులతో సహా అందరూ కలిపి మొత్తం 185 మంది కుటుంబ సభ్యులు ఉండగా, కుటుంబ పెద్ద సుల్తాన్ మాలి. ఇక బాగ్దీ కుటుంబ ప్రత్యేకత గురించి చెప్పాలంటే వంటగదిలో 13 స్టౌవ్‌లు ఎప్పుడూ మండుతూనే ఉంటాయట. ప్రతిరోజూ అందరికీ సరిపడా చపాతీలకోసం 50 కిలోల పిండి, 15 కిలోల కూరగాయలు ఉపయోగిస్తారట. ఇక రేషన్ కోసం అయితే ఏకంగా రూ. 12 లక్షల వరకు ఖర్చు చేస్తారు.

ఇక కుటుంబ సభ్యుల పనుల విషయానికి వస్తే మహిళలు వంట చేస్తారు. పురుషుల్లో కొందరు ప్రైవేటు, మరి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండగా, మరి కొందరు వ్యవసాయం, పశుపోషణ, హార్డ్‌వేర్, కిరాణా షాపుల నిర్వహణ వంటి పనులు చేస్తుంటారు. ఇంకొందరు ట్రాక్టర్లు నడపడం ద్వారా సంపాదిస్తారు. ఇక రాత్రిపూట పిల్లలు, వృద్ధులు, చిన్న వాళ్లు కలిసి ముందుగా భోజనం చేస్తారు. ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేస్తారు. అందరూ కలిసి మెలిసి తినడంలో చాలా ఆనందం ఉందని బాగ్దీ కుంటుంబం చెప్తోంది.

ఆరు తరాలవారు కలిసి ఉంటున్నప్పటికీ బాగ్దీ కుటుంబంలో ఎప్పుడూ గొడవలు, వివాదాలు వంటివి పెద్దగా తలెత్తవట. ఎవైనా సమస్యలు తలెత్తినప్పుడు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని, మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు. ఐక్యమత్యం అనేది తమకు వారసత్వంగా వచ్చిందని బాగ్దీ కుటుంబ పెద్ద సుల్తాన్ మాలి అంటున్నారు. ఓసారి అజ్మీర్‌లో షూటింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఈ ఇంటికి రావడంతో ఒక్కసారిగా బాగ్దీ కుటుంబం గురించి చాలా మందికి తెలిసింది. పైగా ఈ కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సారా అలీఖాన్ తన సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఐక్యమత్యంగా ఉండటం నిజంగా గ్రేట్ అంటూ పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed