అలా చిత్రించడం దురదృష్టకరం -సోనియా గాంధీ 

by Anukaran |
అలా చిత్రించడం దురదృష్టకరం -సోనియా గాంధీ 
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సోమవారం విరుచుకుపడ్డారు. నేడు ప్రజాస్వామ్యం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నదని, ప్రజాస్వామిక పాలన పునాదులపై దాడి జరుగుతున్నదని విమర్శించారు. అసమ్మతిని తీవ్రవాదంగా చిత్రించి అణచివేస్తున్నారని, దేశవ్యతిరేక కార్యకలాపాలుగా ప్రచారం చేస్తున్నారని హిందుస్థాన్ టైమ్స్‌లో ఆమె రాసిన వ్యాసంలో ఆరోపించారు. అణచివేత, బెదిరింపులతో ప్రాథమిక హక్కు భావ ప్రకటన స్వేచ్ఛను ఒక క్రమపద్ధతిలో కాలరాస్తున్నారని, పౌరుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వ సంస్థలను అందుకు విరుద్ధంగా అసమ్మతిదారులను లక్ష్యం చేసుకోవడానికి వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో అనేక సమస్యలను తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందనేది స్పష్టమని వివరించారు. భారత సమాజం కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని డొల్లగా మారుస్తున్నరని వాపోయారు. పౌరసమాజం నేతలు, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత సంస్థలను వినియోగించుకుంటున్నదని తెలిపారు. కేంద్ర ఏజెన్సీలన్నీ ప్రధాని, హోం శాఖ కార్యాలయాల కనుసన్నుల్లోనే నడుస్తున్నాయని ఆరోపించారు.

బీజేపీ వ్యతిరేక నిరసనలను దేశ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రిస్తున్నారని, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమాన్ని ఇలాగే చిత్రించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హాథ్రస్ ఘటననూ ఆమె ప్రస్తావించారు. ప్రధాని ఎప్పుడూ 130 కోట్ల మంది ప్రతినిధిగా చెప్పుకుంటారని గుర్తుచేశారు. కానీ, ఆయన ప్రభుత్వం అసమ్మతిదారులు, ప్రత్యర్థులు, వారి పార్టీకి ఓటేయనివారికి కనీసం ప్రజాస్వామిక హక్కులనూ కాలరాస్తూ రెండో శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నదని ఆరోపించారు. స్వాతంత్ర్య ఉద్యమం, రాజ్యాంగం కాంక్షించిన ప్రజాస్వమ్యం వెలుగులోనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed