రామప్పను మేమే చూసుకుంటాం.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

by  |
ramappa
X

దిశ, తెలంగాణ బ్యూరో : రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడం తెలంగాణకు, దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించిన హైకోర్టు యునెస్కో చెప్పినట్లుగా డిసెంబరు చివరికల్లా సమగ్ర సంరక్షణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్లక్ష్యం జరిగితే దేశమే నిందిస్తుందని, అది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించింది. చారిత్రక సంపదగా రామప్పకు గుర్తింపు లభించడంతో ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్‌రెడ్డిలతో కూడిన బెంచ్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.

రామప్ప ఖ్యాతి గురించి దేశమే గర్వపడుతున్నందున కేంద్ర ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర పురావస్తు శాఖ, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పరిశీలన జరపాలని, ఆగస్టు 4వ తేదీన తొలి సమావేశాన్ని నిర్వహించాలని కూడా నొక్కిచెప్పింది. నాలుగు వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యునెస్కో గుర్తింపునకు తగినట్లుగా అంతర్జాతీయ పర్యాటకుల అంచనాలకు తగినట్లుగా రామప్ప అభివృద్ధి చెందాలని, దీని చారిత్రక ప్రాధాన్యతపై యావత్తు ప్రపంచమే చెప్పుకోవాలని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం రామప్ప కోసం చేపట్టే అభివృద్ధి అంశాన్ని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. నిర్దిష్టమైన కాలపరిమితి విధించుకుని రామప్ప అభివృద్ధి కోసం పనిచేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Next Story

Most Viewed